Heavy Rains | నమస్తే తెలంగాణ నెట్వర్క్ : రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. చెరువు మత్తళ్లు దుంకడం, వాగులు, వంకలు ఉప్పొంగడంతో పలు హైవేలపై రాకపోకలు నిలిచిపోయాయి. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్లోని వడ్డేపల్లి రైల్వే బ్రిడ్జికి తాకుతూ వదర పారడంతో నాలుగు రైళ్లను నిలిపివేశారు. చలివాగు ప్రాజెక్టు 60 ఏండ్లలో తొలిసారి 27 అడుగులకు చేరింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వద్ద జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమ్మక్క-సారలమ్మల గద్దెల వరకు వరద చేరింది.
విజయవాడ-హైదరాబాద్ హైవేపై ఐతవరం వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాలను హుజూర్నగర్ మీదుగా దారి మళ్లించారు. జంపన్నవాగు నీటి ప్రవాహం కొండాయిలోని ఎస్సీకాలనీలోకి చేరడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నార్లాపూర్లో వరద నీటిలో చిక్కుకున్న 16 మందిని రెస్క్యూటీం సురక్షిత ప్రాంతానికి తరలిం చింది. కొండాయి వద్ద జంపన్నవాగులో చిక్కుకున్న ఏడుగురిని క్షేమంగా కాపాడా రు. చిట్యాల మండలం నైన్పాకలోని బుడ్డగాళ్ల రేవు వద్ద మోరంచవాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన అస్సాంకు చెందిన ఐదుగురు, జార్ఖండ్కు చెందిన ఒక కార్మికుడు వరద నీటిలో చిక్కుకోగా ఆర్మీ హెలికాప్టర్ కాపాడింది. కాటారం మండలం గంగారంలో ముగ్గురు రైతులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. గుండ్లవాగు ప్రవాహానికి కార్లు, ఆటోలు, టాటా గూడ్స్, బైక్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
క్షేత్రస్థాయిలో పర్యటించిన పువ్వాడ
భద్రాచలం గోదావరి వరద నీటిమట్టం 48.40 అడుగులకు తగ్గింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హుటాహుటిన భద్రాచలం చేరుకొని వరద పరిస్థితిని జిల్లా అధికారులతో సమీక్షించారు. ఖమ్మం నగరం త్రీటౌన్ ప్రాంతంలోని అనేక కాలనీలు, రూరల్ మండల పరిధిలోని నదీ పరీవాహక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిజామాబాద్ – కరీంనగర్ హైవేపై మాణిక్బండార్ వద్ద వరద నీటితో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన కాన్వాయ్ని పక్కన పెట్టి పోలీస్ వాహనంలో క్షేత్ర పర్యటన చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను మంత్రి అప్రమత్తం చేశారు.
కరీంనగర్లోని లోతట్టు ప్రాంతాలైన ఆటోనగర్లో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. జగిత్యాల జిల్లాలోని దాదాపు 70 చోట్ల కాజ్వేల పై నుంచి వాగులు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట -హనుమకొండ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు పాక్షికంగా 300 ఇండ్లు దెబ్బతినగా, 10 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 883 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సింగరేణి సంస్థ ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. సిరిసిల్లలో పలు వార్డులు వరదలో మునిగిపోయా యి. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కడెం గ్రామా న్ని ఖాళీ చేయించారు. కడెం, దస్తూరాబాద్ మండలాల్లోని 12గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంచిర్యాలలోని లోతట్టు ప్రాంతమైన ఎన్టీఆర్నగర్లో ఎమ్మెల్యే దివాకర్రావు, మున్సిపల్ చైర్మన్ రాజయ్య సందర్శించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం రెడ్డిపల్లిలో దాసరి చందు, చెన్నూరి శంకర్కు చెందిన రెండు ఎద్దులు మేతకు వెళ్లి ఒర్రె వాగులో కొట్టుకుపోయి మృతి చెందాయి.