హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురువారం వర్షం దంచి కొట్టింది. గ్రేటర్ హైదరాబాద్ సహా పలుచోట్ల కుండపోతతో బీభత్సం సృష్టించింది. అత్యధికంగా ఆదిలాబాద్లో 7.75 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 7, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో 6.9 జీహెచ్ఎంసీ పరిధి బాలానగర్లో 6.88, జూబ్లీహిల్స్లో 6.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తోపాటు కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్ పరిధిలో రాత్రి 8 గంటల సమయంలో వర్షం బీభత్సం సృష్టించింది. రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అయింది. రెండు మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి.