హైదరాబాద్ మహానగరంలో మంగళవారం సాయంత్రం పావుగంట పాటు కురిసిన తొలివాన.. రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పుకొనే రేవంత్ సర్కార్ వైఫల్యాన్ని కండ్లకుగట్టింది. రోడ్లు, ఫ్లె ఓవర్లపై మోకాలు లోతుతో పారిన వరదలో.. ఎక్కడికక్కడ స్తంభించిపోయిన ‘చక్ర’బంధనంలో చిక్కుకొని నగరజీవులు పడ్డ నరకయాతన.. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనాన్ని బయటపెట్టింది. హైదరాబాద్ను విపత్తుల నుంచి కాపాడేందుకే ఏర్పడిన హైడ్రా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వానకాలం వరద ముప్పు నివారణకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో చాలాచోట్ల కూడళ్లు చెరువులను తలపించి చివరికి మోటర్లు తెచ్చి నీటిని ఎత్తిపోయాల్సి వచ్చింది. ఏ దారిపై చూసినా వాహనాలను క్రమబద్ధీకరించలేక చేతులెత్తేసిన పోలీసుల తీరుతో గంటల తరబడి తలెత్తిన ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లల ఏడుపు, వృద్ధుల అవస్థలు చూడలేక వారి బంధువులు సహనం నశించి.. కోపంతో ప్రభుత్య వైఫల్యంపై దుమ్మెత్తిపోశారు.
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రవేశంతో మంగళవారం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇన్నిరోజులు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, సాయంత్రం కురిసిన వర్షం నగర ప్రజలకు నరకం చూపించింది. విధులు ముగించుకొని ఆఫీసుల నుంచి బయల్దేరిన ఉద్యోగులు వర్షానికి తడిసిముద్దయ్యారు. భారీ వర్షంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు కూలిపోయాయి.
ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర హైరానా పడ్డారు. ఈదురుగాలులకు 100 ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. మల్కాజిగిరి పరిధిలోని వినాయక్నగర్లో అత్యధికంగా 12.85 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఈదురు గాలులతో విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్తు అంతరాయం కలిగింది. పాతబస్తీ పరిధి చాంద్రాయణగుట్టలో విద్యుత్తు తీగలు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పాతబస్తీ ఛత్తర్బజార్లో ఓ చిన్న కమాన్ కూలి రోడ్డుపై పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, రెవెన్యూ అధికారులు సన్నద్ధం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొలి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏంటని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెల 4న గద్వాల జిల్లాలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, మంగళవారం హైదరాబాద్లోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చు రుకుగా విస్తరిస్తుండటంతో రాబోయే రెండు రో జుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. వచ్చే నాలుగైదు రో జుల్లో రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, దీంతో ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వర్షాలు కురుస్తాయని ఆమె తెలిపారు.
సిద్దిపేట, జనగామ, హనుమకొండ, సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, నారాయణపేట, గద్వాల్, నల్లగొండ, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు తెలిపారు. బుధవారం రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.