హైదరాబాద్ : భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు భారీ వర్షం( Heavy rain) ఎండల నుంచి ఉపశమనం కలిగించింది. అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్ల్రా ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల చెట్లు విరిగిపోయాయి రవాణాకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలకు కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది.
సిద్దిపేట జిల్లా ముత్స్యాలో అత్యధికంగా 12.3 సెం.మీ. వర్షపాతం నమోదయింది. మహబూబూనగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 11 సెం.మీ., నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 8.4 సెం.మీ., నల్లగొండ జిల్లా గుండ్లపల్లిలో 6.2 సెం.మీ. వర్షం కురిసింది. సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. కాగా, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిపోయి నష్టపోతున్నామని రైతులు ఆరోపించారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.