హైదరాబాద్: ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Rain) కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హనుమకొండ (Hunamkonda) జిల్లా పరకాలలో (Parakala) ఈదురుగాలులు, ఉరుములు (Thunderstorms), మెరుపులతో (Lightning) వాన పడుతున్నది. వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేటలో, ములుగు జిల్లాలోని వెంకటాపూర్, ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం, మంగపేట, ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలోని కారేపల్లి మండలంలో, ఇల్లందు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తం వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, వెల్టటూర్, ధర్మారం, ఎండపల్లిలో, కరీంనగర్లోని శంకరపట్నం, వేములవాడ, రుద్రంగి, చందుర్తి, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో భారీ వాన పడింది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, గాల్ల, బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో ఈదురుగాలులతోకూడిన వాన పడుతున్నది.
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి, చిట్యాల, నార్కట్పల్లి, రామన్నపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురువడంతో వర్షంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలుల ధాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి.
రోహిణి కార్తె కావడంతో ఎండ, వడగాల్పుల తీవ్రత ఉన్నప్పటికీ ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని, దీంతో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్లు కురిసే అవకాశం ఉండగా, ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.