హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. శివ్వంపేట మండలంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. భారీ వానతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కుంటలు, చెరువులు అలుగు పారుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వార్షం ధాటికి శివ్వంపేటలో రామాలయం ప్రహరీ గోడ, పురాతన బురుజు గోడ కూలిపోయాయి. మాసాయిపేట మండలంలో హల్దీ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుండగా, వెల్దుర్తి చెరువు మత్తడి పారుతున్నది.
వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్ వద్ద హల్దీవాగు బ్రిడ్జిపై నుంచి పారుతున్నది. దీంతో పోలీసులు వంతెన పైనుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటుచేశారు. కొల్చారంలో కోతుల చెరువు అలుగు పారుతున్నది. భారీవర్షానికి వంతెన కూలిపోవడంతో హవేలి ఘనపూర్-గంగాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మోయతుమ్మెద వాగు, పోరెడ్డిపల్లి వద్ద పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
మెదక్ పరిసర ప్రాంతాల్లో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఏడుపాయల వనదుర్గ క్షేత్రంలోకి వరద నీరు చేరింది. నార్సింగ్ వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తున్నది. వరద ధాటికి ఓ బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రభుత్వ బడులకు సెలవు ప్రకటించారు.