ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆదిలాబాద్, జైనాథ్, తాంసీ, తలమడుగు, బేల మండలాలతోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం (Rain) కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఉదయం నుంచి నిరాటంకంగా కురుస్తున్న వర్షం వల్ల అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా వ్యవసాయ పనులకు ఆటకం ఏర్పడింది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.