హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడింది. రానున్న 24 గంటల్లో దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తూ బలహీనపడే అవకాశం ఉన్నది. ఈ నెల 15 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నిర్మల్ జిల్లాలో ఆటోపై భారీ వృక్షం కూలిన ఘటనలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఇటిక్యాలకు చెందిన డ్రైవర్ బుచ్చన్నతోపాటు రవి అక్కడికక్కడే మృతిచెందారు. నిఖిల్కు తీవ్రగాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ వద్ద ఒర్రెలో కారు కొట్టుకుపోయిన ఘటనలో జగిత్యాల రూరల్ మండలం చల్గల్కు చెందిన బుర్ర గంగు (52), ఆమె మనుమడు కన్నయ్య (2) దుర్మరణం పాలయ్యారు.
శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షంతో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం తడిసిముద్దయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 14 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో కార్మికక్షేత్రం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. వెంకంపేట, బీవైనగర్, సంజీవయ్యనగర్, రాంమందిర్వీధి, శాంతినగర్, ప్రగతినగర్, సర్ధార్నగర్, నేతన్న చౌక్లోని ఇండ్లల్లోకి నీరు చేరింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్హెగ్డే నేతృత్వంలో యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. వరద ముంపుప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన, వసతి సమకూర్చింది. హెల్ప్లైన్ నంబర్ 9100069040ను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావద్దని కోరారు.