హైదరాబాద్ సిటీబ్యూరో, జులై 1 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: జేఎన్టీయూ విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి తమ ప్రతిభ నిరూపించుకున్నారు. అత్యధిక జీతాలు పొందే ఉద్యోగాల్లో వారు రిక్రూట్ అయినట్టు గురువారం జేఎన్టీయూ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఏడాది (2020-21) ప్లేస్మెంట్ సీజన్లో జేఎన్టీయూ కాలేజీ విద్యార్థులు కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పోటీని తట్టుకొని సక్సెస్ అయ్యారని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. 2021 బ్యాచ్కు చెందిన ముగ్గురు సీఎస్ఈ విద్యార్థులు మహ్మద్ ముర్తుజా, బబ్బుల స్ఫూర్తి రాజ్, లక్కిరెడ్డి సాయి ఆశ్రిత్రెడ్డి ప్రముఖ కంపెనీ మైక్రోసాఫ్ట్లో ఏడాదికి ఏకంగా రూ.41 లక్షల జీతం అందుకునే ఉద్యోగం పొందారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇదే అత్యధిక జీతం కావడం వివేశం. అదే గ్రూప్నకు చెందిన అమీషా వాల్మార్ట్ కంపెనీలో ఏడాదికి రూ.21 లక్షల కొలువు సాధించింది. మరో ఏడుగురు విద్యార్థులు ఒరాకిల్ కంపెనీలో ఏడాదికి 11 లక్షల ప్యాకేజీతో కొలువు కొట్టారు. మరో 9 మంది పెగసిస్టంస్ కంపెనీలో ఏడాదికి రూ.10.4 లక్షల జాబ్లో భర్తీ కాగా, ఇంకో 13 మంది ఎల్టీఐలో ఏడాదికి రూ.8.5 లక్షలతో, మరో ఇద్దరు థాట్ వర్క్స్ కంపెనీలో ఏడాదికి రూ.8.3 లక్షలు పొందే ఉద్యోగాల్లో నియమితులయ్యారు. మరో ముగ్గురు విద్యార్థులు ఎన్క్వెరో గ్లోబల్ కంపెనీలో వార్షికానికి రూ.8 లక్షల అందుకునే ఉద్యోగం పొందగా.. ఇంకో ఇద్దరు ఆప్టమ్ కంపెనీలో ఏడాదికి రూ.7.7 లక్షల ప్యాకేజీతో జాబ్ పొందారు. మరో ముగ్గురు టీసీఎస్ డిజిటల్ కంపెనీలో 7.5 లక్షలతో, ఇద్దరు డెలాయిట్ కంపెనీలో రూ.7.6 లక్షలు.. మరో ముగ్గురు విద్యార్థులు మోడల్ ఎన్ కంపెనీలో రూ.7.3 లక్షల ప్యాకేజీతో కొలువులు సంపాదించి తమ ప్రతిభ చాటారు.
కంపెనీల పోటీ
చాలావరకు జేఎన్టీయూ విద్యార్థులు డొమైన్ ఆధారిత కంపెనీలు, సాఫ్ట్వేర్, ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. చాలా కోర్ కంపెనీలు మెకానికల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేశాయి. ఇదిలా ఉండగా మరో నలుగురు కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులను ఐటీసీ కంపెనీ వార్షికానికి రూ.8.5 లక్షల జీతాలతో ఉద్యోగాలు కల్పించింది. మరో ఆరుగురు విద్యార్థులు ఏడాదికి రూ.9 లక్షల ప్యాకేజీతో హనీవెల్ కంపెనీలో ఉద్యోగం పొందారు. మెకానికల్ నుంచి ఏడుగురు విద్యార్థులు హీరో మోటర్ కార్ప్ కంపెనీలో ఏడాదికి రూ.7.25 లక్షల ప్యాకేజీతో కొలువు సంపాదించారు. కాగా, హ్యుండాయ్ ట్రాన్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ మొదటిసారిగా జేఎన్టీయూకి విచ్చేసి ఆరుగురు మెకానికల్ విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. మరో కంపెనీ ఎంటార్ 25 మంది మెకానికల్ విద్యార్థులను జాబ్కు ఎంపిక చేసింది. ఆరుగురు కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు అరబిందోలో ఉద్యోగాలు సంపాదించారు. ఇదిలా ఉండగా 200 మంది విద్యార్థులు టీసీఎస్, యాక్సెంచర్, విప్రో తదితర కంపెనీల్లో ప్లేస్మెంట్స్ పొందారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభు కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం మన్జూర్ హుస్సేన్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు.
సత్యనాదెళ్ల నాకు రోల్ మోడల్
చాలా హ్యాపీగా ఉంది. రూ.41 లక్షల ప్యాకేజీతో జాబ్ పొందడం గొప్పగా ఉంది. ఇంటర్వ్యూలోని అన్ని రౌండ్లను సమర్థంగా ఎదుర్కొన్నా. చివరికి సెలెక్ట్ అయ్యావని కాల్ వచ్చింది. మనం ఇంజినీరింగ్లో చేరే సమయంలోనే బాగా చదువుకోవాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ఈ విజయంలో మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరవలేనిది. జేఎన్టీయూకు థ్యాంక్యూ. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన వారందరికి ధన్యవాదాలు.
సమయాన్ని వినియోగించుకుంటే సక్సెస్ సొంతం
నా డ్రీమ్ నిజమైంది. ఇంజినీరింగ్లో జాయిన్ అయ్యే సమయంలోనే పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందేలా కష్టపడాలని భావించాను. చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్న కూడా మ్యాథ్స్ టీచర్ కావడంతో నాకు ఆ సబ్జెకు పట్ల మరింత ఇష్టం పెరిగింది. మా ఇంజినీరింగ్ మరో నెలలో ముగుస్తుంది. ఈ లోపునే మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం పొందడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివితే కచ్చితంగా సక్సెస్ అవుతాం. ప్రతిరోజు 5 గంటలకు పైగా చదివేదాన్ని. మా జేఎన్టీయూ అధ్యాపకులు, అక్క, స్నేహితుల సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి.
-బబ్బుల స్ఫూర్తిరాజ్, జేఎన్టీయూ
ప్రణాళిక ఉండాలి
మా తల్లిదండ్రల ప్రోత్సాహం మరవలేనిది. వారే నాకు రోల్ మోడల్. పెద్ద కంపెనీలో జాబ్ సాధించాలనే తపన ఉండేది. ఆ మేరకు నేను ప్రతి రోజు సన్నద్ధమయ్యాను. అత్యధిక వేతనంతోకూడిన ఉద్యోగాలు పొందాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. అందుకు తగ్గ ప్రణాళికలు వేసుకుని కష్టపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లే ఆలోచన లేదు. బాగా కష్టపడి గొప్ప పొజిషన్ వెళ్లడానికి కృషి చేస్తాను. నాకు సహకరించిన జేఎన్టీయూకు ధన్యవాదాలు.