శ్రీశైలం : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2.54లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయిలో నీటితో కళకళలాడుతుండగా.. ఏడుగేట్ల ఎత్తి, సాగర్కు విడుదల చేశారు. జూరాల గేట్ల ద్వారా 80,400 క్యూసెక్కులు, కరెంటు ఉత్పత్తి ద్వారా మరో 20,717 క్యూసెక్కులు వస్తున్నది. సుంకేశుల నుంచి 51,732 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
సాయంత్రం వరకు రిజర్వాయర్కు 2,54,453 క్యుసెక్కుల ఇన్ఫ్లో రికార్డు అయ్యిందని అధికారులు తెలిపారు. దీంతో ఏడుగేట్లు ఎత్తి 1,94,922 క్యూసెక్కులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కుడి, ఎడమగట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని చెప్పారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగుల మేర నీరున్నది. గరిష్ఠ నీటి నిల్వసామర్థ్యం 215 టీఏంసీలు కాగా.. ప్రస్తుతం 212.91 టీఏంసీల నీరు నిల్వ ఉన్నదని అధికారులు వివరించారు.