మహబూబ్నగర్,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ వచ్చిం ది. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు వరద పోటెత్తుతున్నది. ఆదివారం ఆల్మట్టికి 3లక్షల క్యూసెక్కుల వర ద, నారాయణపురకు 2.93 లక్షల వరద వస్తున్నది. జూరాలకు సాయంత్రం 6 గంటలకు 4,04,230 క్యూసెక్కుల భారీగా వరద రాగా.. 44 గేట్లు తెరిచి దిగువకు 4,06,643 క్యూసెక్కులను విడుదల చేశారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు 3,69,054 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా.. తెలంగాణ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు ద్వారా 25,426 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు.
కృష్ణా, తుంగభద్ర నుంచి భారీ వరద వస్తుండటంతో మూడు, నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నా రు. తుంగభద్ర ప్రాజెక్టుకు సైతం భారీ వరద వస్తుండటంతో తొలిసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టుకు 1,91,957 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 12 గేట్లు ఎత్తి 36,217 క్యూసెక్కుల వరదను దిగువనకు వదులుతున్నారు. నాగార్జునసాగర్కు 31 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. మూసీకి 3,362 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. గోదావరి బేసిన్లోని ఎస్సారెస్పీకి 29,795 వేల క్యూసెక్కులు మాత్రమే వస్తున్నది. శనివారం ఎల్లంపల్లికి 1.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ఆదివారం 46 వేల క్యూసెక్కులకు పడిపోయింది.
శాంతించిన గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు తగ్గుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్ట డం, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో నదిలో వరద తగ్గుతున్నది. శనివారం సాయంత్రం 48 అడుగులకు నీటిమట్టం చేరడంతో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం ఉదయం 46.70 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక, సాయం త్రం 4 గంటలకు 42.20 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ప్రవాహం 41 అడుగులకు చేరుకున్నది.