హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఎగువన మహారాష్ట్రతో పాటు, రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు శుక్రవారం 27 వేల క్యూసెక్కుల వరద రాగా, శనివారం లక్ష క్కూసెక్కులకు పెరిగింది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 39.70 టీఎంసీలకు చేరుకొన్నది. మహారాష్ట్రలోని జయక్వాడ్, కల్యాణి, బాబ్లీ ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో దిగవకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది.
ఎస్సారెస్పీ దిగువన గోదావరి పరివాహక ప్రాంతంలోనూ సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురియడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం 24,614 క్యూసెక్కుల వరద రాగా, శనివారం సాయంత్రానికి 38 వేల క్యూసెక్కులకు పెరిగింది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.07 టీఎంసీలకు చేరుకొన్నది. దీంతో రిజర్వాయర్ గేట్లను ఎత్తి దిగువకు 10 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు సైతం వరద పోటెత్తుతున్నది. ఇన్ఫ్లో శుక్రవారం 10,588 క్యూసెక్కులు ఉండగా, శనివారం ఒక్కసారిగా 51వేల క్యూసెక్కులకు పెరిగిపోయింది. దీంతో ప్రాజెక్టు గేట్లను మొత్తం ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి బరాజ్లకు సైతం వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది.
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతున్నది. ఆల్మట్టికి 78 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. తుంగభద్రలో సైతం వరద ఉధృతంగా కొనసాగుతున్నది. సాయంత్రం నాటికి టీబీడ్యామ్కు 98,644 క్యూసెకుల ఇన్ఫ్లో వస్తున్నది. అవుట్ఫ్లో 216 క్యూసెకులుగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 73.939 టీఎంసీలకు చేరుకొన్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నందున వరద తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మరో రెండు రోజుల్లో డ్యామ్ పూర్తిస్థాయిలో నిండితే గేట్లు తెరిచే అవకాశం ఉన్నదని వెల్లడించారు. తుంగభద్ర నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఇప్పటికే తుంగభద్ర బోర్డు అధికారులు కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చారు.