Medigadda Barrage | మహదేవపూర్, ఫిబ్రవరి 18: కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బరాజ్ను వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలాచేసి, దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించే కుట్రలు తీవ్రతరమయ్యాయి. బరాజ్కు రిపేర్లు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు అన్నారం బరాజ్ నుంచి భారీగా నీటిని వదిలింది. శనివారం 10 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేసింది.
అన్నారం బరాజ్ నుంచి వస్తున్న వరద నీరు, ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాణహిత నది ద్వారా కలిసి మొత్తం 19,430 వేల క్యూసెక్యుల వరద మేడిగడ్డ బరాజ్వైపు వస్తున్నది. దీంతో మేడిగడ్డ బరాజ్లోని మొత్తం 85 గేట్లకుగాను ప్రస్తుతం 59 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.
కుంగిన పియర్స్ వైపు వరద నీరు గతంలో బరాజ్లోని ఏడో బ్లాక్లో ఉన్న పియర్లవైపు ఉన్న నీటిని అధికారులు వాటర్ డైవర్ట్ చేశారు. కుంగిన పియర్స్కు మరమ్మతు పనుల నేపథ్యంలో బరాజ్లో గతంలో వాటర్ డైవర్షన్ చేసి నీటిని కుంగిన పిల్లర్ల వైపు వెళ్లకుండా చర్యల చేపట్టారు. బరాజ్ ఒకటో పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు వదరనీరు వెళ్లకుండా మట్టిరహదారి వేసి వాటర్ పంపింగ్ మోటర్లతో దారి మళ్లించారు.
ఆదివారం బరాజ్ ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద కుంగిన పియర్ల వైపు వచ్చి చేరుతున్నది. ఇది మేడిగడ్డపై మరో క్రుట కోణంలో భాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడో బ్లాక్వైపు నీరు వెళ్లకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. దీంతో వరద నీటిని కుంగిన పియర్లవైపు కావాలనే వెళ్లేలా చేశారా? అనే అనుమానాలు తలెత్తున్నాయి. బరాజ్ డౌన్స్ట్రీమ్ (బరాజ్ దిగువ ప్రాంతం)లో సైతం వాటర్ డైవర్షన్ పనులు పూర్తిగా నత్తనడక సాగుతున్నాయి.
భారీగా వరదనీరు వస్తున్న తరుణంలో ఎడవ బ్లాక్ వైపు చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు డైవర్షన్ చేయాల్సిన ఉండగా, బరాజ్ వద్ద అందుబాటు ఉన్న 7 యంత్రాల్లో కేవలం ఒక పంపింగ్ మోటర్తో ఏడో బ్లాక్ వద్ద పైపులతో వాటర్ డైవర్షన్ చేస్తున్నారు. మిగతా పంపింగ్ యంత్రాలను ఒడ్డుకు చేర్చారు. దీని వెనక ఉన్న మతలబేంటో తెలియరాలేదు.
ఇది అధికారుల నిర్లక్ష్యానికి కారణమా? పై నుంచి వస్తున్న ఒత్తిళ్లతో చేసేదేమీ లేక తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా భారీస్థాయిలో వరద నీరు పెరుగుతున్నప్పుడు సంబంధిత శాఖ అధికారులు బరాజ్ వద్ద అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలి. కానీ, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.