హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న వానకాలం సీజన్లో పంటల దిగుబడి గతం కంటే భారీగా పెరుగుతుందని అర్థ గణాంకశాఖ తొలి అంచనా వేసింది. ఈ సీజన్లో మొత్తం ఆహార ధాన్యాల దిగుబడి 1.55 కోట్ల టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నది. ఇందులో వరి ధాన్యం దిగుబడి 1.38 కోట్ల టన్నులు ఉండొచ్చని అంచనా. గతేడాదితో పోల్చితే ఇది 24.96 లక్షల టన్నులు అధికమని తెలిపింది. వరి పంటను గతేడాది 52.51 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి సాగు విస్తీర్ణం 52.65 లక్షల ఎకరాలకు పెరిగినట్టు వెల్లడించింది. ఈసారి పత్తి సాగు విస్తీర్ణం గతేడాది కంటే తగ్గినప్పటికీ, దిగుబడి మాత్రం పెరగొచ్చని అంచనా వేసింది. ఈ వానకాలం సీజన్లో 50.94 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేస్తుండగా.. సుమారుగా 69.46 లక్షల బేళ్ల వరకు ఉత్పత్తి కావొచ్చని పేర్కొంది. గతేడాది పత్తిని 58.28 లక్షల ఎకరాల్లో సాగుచేయగా 57.87 లక్షల బేళ్లు ఉత్పత్తయ్యింది. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం కూడా గతేడాది కంటే తగ్గినప్పటికీ, దిగుబడి మాత్రం 3.32 లక్షల టన్నుల వరకు పెరుగుతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుత సీజన్లో 10.60 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలను సేద్యం చేస్తుండగా 5.80 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని అంచనా. గతేడాది 12.62 లక్షల ఎకరాల్లో సాగు చేసినప్పటికీ పప్పుధాన్యాల దిగుబడి 3.74 లక్షల టన్నులకే పరిమితమైంది.