హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన 24 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగత్రలు నమోదయ్యాయని వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో 45.9 డిగ్రీలు నమోదు కాగా, నల్లగొండ జిల్లా కట్టంగూర్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, సిద్దిపేట జిల్లా కోహెడలలో 45.8, మంచిర్యాల జిల్లా దండేపల్లి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులతో 45.7 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నది.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లానల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. వచ్చే పదిరోజులు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు చేరుకుంటాయని హెచ్చరించింది. 1877 తర్వాత ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నదని వివరించింది. ప్రపంచంలోని వేడి నగరాల జాబితాలో 100కుపైగా నగరాలు భారతదేశానికి చెందినవిగా ఉన్నాయని పేర్కొన్నది. కాగా, నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఈనెల 26న కేరళను తాకే అవకాశం ఉన్నదని తెలిపింది. దీంతో రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తామని వెల్లడించింది.