NIMS | ఖైరతాబాద్, మే 23 : గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి నిమ్స్ వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. వివరాల్లోకెళ్తే… ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన షేక్ షనాజ్ (29) రెండేండ్లుగా డైలేటెడ్ కార్డియో మయోపతి (గుండె ఎడమ జఠరిక వద్ద సమస్య)తో బాధపడుతున్నది. దీని కారణంగా గుండె పనితీరు మందగించి, శరీరానికి కావాల్సిన రక్తాన్ని పంపింగ్ చేయలేకపోతుంది. ఎన్ని దవాఖానలు తిరిగిన ఫలితం లేకపోవడంతో మూడు నెలల క్రితం ఆమె నిమ్స్ వైద్యులను ఆశ్రయించింది. ఈ మేరకు నిమ్స్ కార్డియోథోరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర రావు, డాక్టర్ గోపాల్ నేతృత్వంలో రోగికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్ల ప్రకారం రోగికి గుండె మార్పిడి తప్పనిసరి అని వైద్యులు తేల్చారు.
ఈ మేరకు రోగి కుటుంబ సభ్యులు నిమ్స్ వైద్యాధికారుల సహకారంతో జీవన్దాన్లో పేరు నమోదు చేయించుకొని, అవయవదాత కోసం నిరీక్షిస్తున్నారు. అయితే రెండ్రోజుల క్రితం సికింద్రాబాద్ యశోద దవాఖానలో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్కు గురైనట్టు జీవన్దాన్ వైద్య బృందం గుర్తించింది. సదరు జీవన్మృతుడి బ్లడ్ గ్రూప్తో రోగి షనాజ్ బ్లడ్ గ్రూప్ సరిపోలడంతో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో బుధవారం డాక్టర్ ఆమరేశ్వర రావు సారధ్యంలో వైద్య బృందం విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రైవేటులో రూ.30లక్షల నుంచి రూ.40లక్షల వరకు ఖర్చయ్యే గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిమ్స్ వైద్యులు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా జరిపినట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. అనంతరం వైద్యసిబ్బందిని అభినందించారు.