ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 5 : కోడలు మరణ వార్త విని గుండెపోటుతో అత్త కన్నుమూసిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారంలో చోటుచేసుకున్నది. రుద్రారం గ్రామానికి చెందిన పాపిగల్ల కమలమ్మకు కొడుకు పద్మారావు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పద్మారావు రెండు రోజుల క్రితం భార్య రుక్మిణితో కలిసి మెదక్ జిల్లాలోని ఏడుపాయలకు వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా తెల్లవారు జామున రుక్మిణి పడుకున్న చోటే మృతి చెందింది. తీవ్ర ఆందోళనకు గురైన పద్మారావు సుమారు 9 గంటల ప్రాంతంలో రుద్రారం గ్రామంలోని తల్లి కమలమ్మకు, ఇతర బంధువులకు సమాచారం ఇచ్చాడు. తీవ్ర మనస్తాపానికి గురైన కమలమ్మ గుండెపోటుతో మృతిచెందింది. ఒకే ఇంట్లో అత్తాకోడలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.