Group-1 : తెలంగాణలో గ్రూప్-1 (Group-1) నియామకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టు (High court) లో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలుకు టీజీపీఎస్సీ (TGPSC) తరఫు న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
కాగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని గతంలో పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గత నెలలో వాదనలు జరిగాయి. పునర్మూల్యాంకనం చేయాలని, లేదంటే మరోసారి మెయిన్స్ నిర్వహించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.
దాంతో అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని, నిపుణులతో మెయిన్స్ పత్రాల మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 నియామకాలు ఆలస్యమైతే ఎంపికైన అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం అప్పట్లో గ్రూప్-1 నియామకాలపై స్టే విధించింది. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని పేర్కొంది.
ఈ క్రమంలో గ్రూప్-1 నియామకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఎంపికైన నలుగురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కౌంటరు దాఖలు చేయడానికి సమయం కావాలని టీజీపీఎస్సీ న్యాయవాది కోరారు. దాంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
విచారణను ఆలస్యం చేయవద్దని, దీనివల్ల ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. టీజీపీఎస్సీ వినిపించిన వాదనలే మళ్లీమళ్లీ వినిపించవద్దని సూచించింది. ఈ నెల 30న పూర్తిస్థాయి వాదనలు వింటామని పేర్కొంది.