Arogya Mahila | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 70వేల మంది మహిళలకు పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 ఉమెన్ క్లినిక్స్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), రక్త హీనత (అనీమియా) పరీక్షలు,అవసరమైన వారికి టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. రిపోర్టులను 24 గంటలలోపే అందిస్తారు. సమస్యలను గుర్తిస్తే, అక్కడికక్కడే తగిన మందులు ఇస్తున్నారు. అవసరమైతే పైదవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. ఇప్పటివరకు 25వేల మంది మహిళలకు టెస్టులు నిర్వహించారు.
22 మందికి క్యాన్సర్ నిర్ధారణ
దేశంలో క్యాన్సర్ బారినపడిన మహిళల్లో 25 శాతం మందికి నోరు(ఓరల్), రొమ్ము (బ్రెస్ట్), గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్) క్యాన్సర్ బాధితులే. ఈ నేపథ్యంలో ఉమెన్ క్లీనిక్స్ ద్వారా ప్రభుత్వం క్యాన్సర్పై ప్రత్యేక దృష్టిపెట్టింది. 30 ఏండ్లకు పైబడిన మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. లక్షణాల ఆధారంగా సర్వైకల్, ఓరల్ క్యాన్సర్లకు పరీక్షలు చేస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని జిల్లా దవాఖానలు లేదా టీచింగ్ హాస్పిటళ్లకు రెఫర్ చేస్తున్నారు.