కరీంనగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ అంటే అత్యంత సమస్యాత్మక ప్రాంతం. నిత్యం నక్సల్స్, పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ ప్రాంతంలో పేదలకు వైద్యం అందరి ద్రాక్షగానే ఉండేది. అలాంటి ప్రాంతంలో మెడికల్ కళాశాలలు నెలకొల్పేందుకు ఎవరు ముందుకురాని సమయంలో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థను చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్రావు స్థాపించి నాణ్యమైన వైద్యులను తయారుచేయటం మొదలుపెట్టారు. 2001 డిసెంబర్ 1న అప్పటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా ఈ కళాశాల ప్రారంభమైంది. ఒక పక్క మెడికల్ కళాశాల నిర్వహిస్తూనే మరో పక్క పేదలకు అత్యంత తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిమ మేనేజ్మెంట్ మొదటి నుంచే వినూత్న కార్యక్రమాలను చేపడుతూ వచ్చింది. కళాశాల ప్రారంభం నుంచి రూ.2 వేలకే గర్భిణులకు నెలనెలా పరీక్షలు నిర్వహిస్తూ వారి ప్రసవం వరకు కంటికి రెప్పలా కాపాడేలా ‘తల్లీ బిడ్డ’ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. అవసరమైన రోగులకు తలసేమియా యూనిట్ ఇవ్వటం ప్రారంభించారు. ఈ యూనిట్ ప్రారంభ కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరయ్యారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సలు పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో ప్రత్యేక వార్డులు తెరిచి వందల మందికి సేవలందించారు. ఇలా ప్రతిమ మెడికల్ కళాశాల తన విశిష్టతను చాటుకొంటున్నది. ఏటా 200 మంది ఎంబీబీఎస్ వైద్యులను, 140 పీజీ వైద్యులను దేశానికి అందిస్తున్నది.
కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న నగునూర్లో స్థాపించిన ‘ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్’ను స్థాపించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కళాశాలలో గురువారం అట్టహాసంగా ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్ విశిష్ఠ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్రావును మంత్రి తన్నీరు హరీశ్రావు అభినందించారు. కల్లోలిత ప్రాంతమైనా భయపడకుండా ఇంత పెద్ద మెడికల్ కళాశాలను స్థాపించిన ధైర్యవంతుడు అని కొనియాడారు. డబ్బు కోసం పాకులాడే వ్యక్తి కాదని, విలువలకు కట్టుబడే వ్యాపారవేత్త అని ప్రశంసించారు. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, విలువలు కాపాడేందుకు ప్రయత్నించాలని మెడికోలకు సూచించారు. కళాశాల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. అధ్యాపక బృందం కృషివల్లనే కళాశాల వృద్ధిలోకి వచ్చిందని అన్నారు. తమపై నమ్మంతో పనిచేస్తున్న సిబ్బందికి అన్నివిధాలుగా అండగా ఉంటున్నామని హామీ ఇచ్చారు. 20 ఏండ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి రూ.లక్ష, 10 ఏండ్లుగా పనిచేస్తున్నవారికి రూ.50 వేల చొప్పున బహుమతి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన ఏడుగురు వైద్య విద్యార్థులకు మార్తాండరావు చారిటబుల్ సంస్థ ద్వారా గోల్డ్ మెడల్స్ అందించారు.
ప్రతిమ మెడికల్ కళాశాల అత్యున్నత వైద్య విద్యను అందిస్తున్నది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. నేను ప్రతిమ విద్యార్థిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. కళాశాలలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, క్రిటికల్ కేర్ యూనిట్స్ 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో మొదటిసారిగా హై అండ్ సిమ్యులేషన్ ల్యాబ్ సౌకర్యం ప్రతిమలోనే అందుబాటులోకి వచ్చింది.
– డాక్టర్ దుబాసి స్వాతి విజయలక్ష్మి, హౌస్సర్జన్
కుప్పంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రతిమలో పీడియాట్రిక్లో చేరడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఈ డిపార్ట్మెంట్ హెచ్వోడీ డాక్టర్ అమిత్రావు పోత్సాహం, మా ప్రొఫెసర్ల మార్గదర్శకత్వం ఎంతో మంచి విద్యను అభ్యసించేందుకు దోహదపడుతున్నది. మా ఎన్ఐసీయూ నుంచి అనీమియా, తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా రక్త మార్పిడి చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. ఇప్పటి వరకు 600 మంది పిల్లలకు ఉచితంగా రక్తమార్పిడి, కలేషన్ థెరపీ, మందులు, పరీక్షలు వంటివి అందించాం.
– డాక్టర్ నూకసాయి జయచందర్రెడ్డి, పీడియాట్రిక్ (పీజీ)