ములుగు, సిరిసిల్లలో ఆరోగ్య పరీక్షలు సంపూర్ణం
కొనసాగుతున్న రక్త, మూత్ర నమూనాల విశ్లేషణ
త్వరలోనే ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ కార్డుల జారీ
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడి
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు తొలి దశ పూర్తయిందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లో ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాయని, ఇప్పటివరకు సేకరించిన మూత్ర, రక్త నమూనాలను ల్యాబొరేటరీలో విశ్లేషిస్తున్నారని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత హెల్త్ప్రొఫైల్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో హెల్త్ ప్రొఫైల్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 70 రోజుల్లోనే ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించినట్టు తెలిపారు.
వైద్య బృందాలు ఇండ్ల వద్దకు వెళ్లి కుటుంబసభ్యుల ఎత్తు, బరువు, బీపీ, షుగర్, రక్తంలో ఆక్సిజన్ శాతం, కాటరాక్ట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేసి, రక్త నమూనాలు సేకరించారని వివరించారు. ఈ నమూనాలతో హిమోగ్లోబిన్ శాతం, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, సీబీపీ, థైరాయిడ్ వంటి పాథాలజీ పరీక్షలు చేస్తారని తెలిపారు. ఒక వ్యక్తికి గతంలో ఎలాంటి వ్యాధులు లేకపోతే ఒకసారి మాత్రమే రక్త నమూనాలు తీసుకొని 8 అంశాల సమాచారం సేకరిస్తామని చెప్పారు. గతంలో వ్యాధులు ఉంటే రెండుసార్లు రక్త నమూనాలు తీసుకొని 30 అంశాల్లో విశ్లేషిస్తామని పేర్కొన్నారు. దీంతో ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్య సమాచారం డాటా సెంటర్లో నిక్ష్లిప్తమవుతుందని పేర్కొన్నారు. రక్త నమూనాల విశ్లేషణ పూర్తయిన తర్వాత యాప్ నుంచి ఆ సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా లబ్ధిదారుడి ఫోన్కు ఎస్సెమ్మెస్ వెళ్తుందని చెప్పారు. రక్తనమూనాలు ఇవ్వని వారిని గుర్తించి, వాటిని సేకరించాలని అధికారులను ఆదేశించారు.
టీ డయాగ్నోస్టిక్స్లో రక్త నమూనాల విశ్లేషణ పూర్తయిన 24 గంటల్లోగా ఆ వ్యక్తికి సమాచారం అందేలా కుటుంబ సంక్షేమశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ రిపోర్టుల్లో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్టు తేలితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తూ మెసేజ్ పంపాలని స్పష్టంచేశారు. భవిష్యత్తులో హెల్త్ప్రొఫైల్ కార్డుల ఆధారంగానే చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ శ్వేతామహంతి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్రావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల, ములుగు డీఎంహెచ్వోలు పాల్గొన్నారు.
మనసు, శరీరం, ఆత్మను ఏకం చేసేదే యోగా
యోగా మన మనసు, శరీరం, ఆత్మను ఏకం చేసి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుందని వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆయుర్వేద, నాచురోపతి విద్యార్థుల ఆధ్వర్వంలో శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించనున్న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఆయుష్ కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యోగాసనాలు, ప్రాణాయామంతో ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెరుగుతుందని చెప్పారు.