హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 32 లక్షల డోసుల వ్యాక్సిన్ నిల్వ ఉందన్నారు. ఆ వ్యాక్సిన్ గడువు తేదీ ముగిసేలోగా బూస్టర్ డోస్కు అనుమతిస్తే ఉపయోగం ఉంటుందని హరీశ్రావు పేర్కొన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మాన్సుక్ మాండవీయ ఇవాళ అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. 18 ఏండ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే 60 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో బూస్టర్ డోసు ఇచ్చారు. మిగతా వారికి బూస్టర్ డోసు ఇచ్చేందుకు ఇది సరైన సమయం అని హరీశ్రావు అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్రానికి రెండు సార్లు లేఖలు రాశామని, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని మంత్రి గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యమైనంత వరకు కొవిడ్ ర్యాపిడ్ టెస్టులు, ఆర్టీ పీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచుతున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు.
• ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషన్ డోస్ కు అనుమతించండి.
• 32 లక్షల డోసుల నిల్వ ఉంది, గడువు తేదీ ముగిసే అవకాశం ఉంది.
• రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్.
• ఇంటింటికి వాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడి. pic.twitter.com/6uUTYeDIem— Harish Rao News (@TrsHarishNews) June 13, 2022