హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన రెండో విడత కంటివెలుగు విజయవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంపై సీఎం కేసీఆర్ రోజూ ఆరా తీస్తున్నారని చెప్పారు. ఎన్ని పరీక్షలు జరిగాయి? ఎంత మందికి అద్దాలు ఇచ్చారు? వంటి వివరాలను తెలుసుకుంటున్నారని తెలిపారు. అధికారులు ఎలాంటి లోపాలు లేకుండా కార్యక్రమాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు. కంటి వెలుగు, సీపీఆర్ తదితర అంశాలపై మంత్రి హరీశ్ రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 పని దినాల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తు చేశారు.
ఇప్పటివరకు 59 రోజుల్లోనే 1.17 కోట్ల మందికి కంటి పరీక్షలు జరిపామని చెప్పారు. ఇందుకు కృషి చేస్తున్న డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, కంటి వైద్యులు, సూపర్వైజర్లు, ఏన్ఎలు, ఆశాలు, డీఈవోలు, సహకరిస్తున్న పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపుల నిర్వహణలో సిబ్బందికి భోజన, వసతి, వాహన సదుపాయాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, దీనికి నిధులను ఇప్పటికే ఆయా జిల్లాలకు ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. ఎండాకాలం నేపథ్యంలో క్యాంపుల వద్ద వైద్య సిబ్బందికి, పరీక్షల కోసం వచ్చే ప్రజలకు నీడ కల్పించాలని, కుర్చీలు, మంచినీరు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
నగరాల్లో 80 శాతం మందికి పూర్తి
రోజుకు సగటున ఒక్కో క్యాంపులో 120 మందికి పరీక్షలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. నగరాలు, పట్టణాల్లో ఇప్పటివరకు 2,768 వార్డుల్లో క్యాంపుల నిర్వహణ పూర్తయిందని చెప్పారు. నిర్దేశిత లక్ష్యంలో ఇది 80.23 శాతమని, 8,351 గ్రామ పంచాయతీల్లో 66 శాతం కంటివెలుగు క్యాంపుల నిర్వహణ పూర్తయిందని తెలిపారు. పరీక్షలు చేసి, అవసరమైన వారికి ప్రిసిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేయడంలో ముందున్న హన్మకొండ, వికారాబాద్ జిల్లాల డీఎంహెచ్వోలు, సిబ్బందిని అభినందించారు.
సీపీఆర్ శిక్షణ వేగవంతం చేయాలి
సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయిన వారిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రారంభించిన సీపీఆర్ శిక్షణను మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేత మహం తి, డీఎంఈ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేటలో కీమోథెరపీ ప్రారంభం
సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో కీమోథెరపీ సెంటర్ను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో మొట్టమొదటి కీమోథెరపీ సెంటర్ను సిద్దిపేటలో ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. కాగా ఖమ్మం, కరీంనగర్, వనపర్తి, సిరిసిల్లకు కూడా మంజూరైనట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ వ్యాధి చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని అన్నారు. దశల వారీగా అన్ని జిల్లాల్లోని మెడికల్ కళాశాలల్లో కీమోథెరపీ సెంటర్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. – సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి