సిద్దిపేట, జనవరి 5: ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని, సర్కా రు దవాఖానలను బలోపేతం చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నదని వైద్యారోగ్య శాఖ మం త్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘పోలీస్ ఆరోగ్యరక్ష’ కార్యక్రమానికి సిద్దిపేట నుంచి మంత్రి శ్రీకారం చుట్టారు. సిద్దిపేటలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో గురువారం జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సీపీ ఎన్ శ్వేతతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. పోలీసుల హెల్త్ ప్రొఫైల్ నిక్షిప్తానికి ప్రభుత్వం సిద్దిపేట నుంచి శ్రీకారం చుట్టిందని చెప్పారు.
ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా నిత్యం విధి నిర్వహణలో ఉండే పోలీసుల ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వం భావిస్తున్నదని, అందులో భాగంగా ముందుగా వారికే వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించే కార్యక్రమమైన ‘పోలీస్ ఆరోగ్యరక్ష’ ప్రారంభించామని తెలిపారు. పోలీస్, పొలిటికల్, ప్రెస్రంగాల్లో ఉండేవారు నిత్యం ఒత్తిడికి గురవుతారని, ఆరోగ్యంపై దృష్టిసారించేంత టైం వారికి ఉండదని చెప్పారు. ఈ మూడు రంగాల్లో పనిచేస్తున్న వారు చిన్న వయస్సులోనే రోగాల బారినపడుతున్నారని అన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి మూడు క్యాటగిరీలుగా విభజించి అవసరమైన పరీక్షలు ఉచితంగా చేయిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు. నేటి ఉరుకులు పరుగుల ఆధునిక జీవన విధానంలో మనిషి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల హైదరాబాద్లో కొందరు యువకుల్లో ర్యాండమ్ సర్వే చేస్తే 70శాతం మందికి బీపీ, షుగర్ ఉన్నట్టు తేలిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు, ఆడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ విమలా థామస్, డీఎంహెచ్వో డాక్టర్ కాశీనాథ్, నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం, నాయకులు పాల్గొన్నారు.