25 పనిదినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, అవసరం ఉన్నవారికి కండ్లద్దాలు అందజేయడం గొప్ప విషయం. ప్రభుత్వ లక్ష్యం చాలా పెద్దది. ప్రపంచంలో అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమంగా రికార్డు సృష్టించేందుకు కష్టపడుతున్నాం. కంటివెలుగుతో ప్రజలకు ఆనందబాష్పాలు వస్తుంటే, ప్రతిపక్షాలకు కన్నీటిబొట్లు రాలుతున్నాయి.
– మంత్రి టీ హరీశ్రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం వరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య 50 లక్షల మార్క్ను దాటిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. వీరిలో 16 లక్షల మంది నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించామని వెల్లడించారు. మరో 35 లక్షల మందికి ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారణ అయిందని చెప్పారు.
‘25 పనిదినాల్లో ఇంత పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, అవసరం ఉన్నవారికి కండ్లద్దాలు అందజేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కంటి వెలుగు విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న మున్సిపల్, పంచాయతీ శాఖలకు, జిల్లా కలెక్టర్లకు, వివిధ విభాగాల అధికారులకు, ప్రతి ఒక్కరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సిద్దిపేటలోని ఏకలవ్య భవన్లో నిర్వహించిన శిబిరంలో ఆయన స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారితో ముచ్చటించారు.
అనంతరం మీడియాతో హరీశ్రావు మాట్లాడుతూ.. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. కండ్లు కనబడకపోతే ప్రపంచమే చీకటిగా మారుతుంది. చాలామంది తమకు దృష్టి లోపాలు ఉన్నా.. చిన్న సమస్యే కదా అని వదిలేస్తూ కాలం గడుపుతుంటారు. చివరకు అది పెద్ద సమస్యకు దారితీస్తుంది. దీనికి పరిష్కారంగా సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కంటి వెలుగు అనే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు’ అని పేర్కొన్నారు. సామూహికంగా ప్రపంచంలో ఇంత పెద్ద కంటి వెలుగు కార్యక్రమం ఎక్కడా జరగలేదని తెలిపారు.
తమ పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటూ రాష్ట్రంలోని ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం చాలా పెద్దదని, ప్రపంచంలో అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమంగా రికార్డు సృష్టించేందుకు కష్టపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కంటి సమస్యలు దూరం చేయాలన్నదే తమ లక్ష్యమని, నివారింపదగ్గ అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు.
తమకు కుల, మత, జాతి తారతమ్యం లేదని మానవత్వం, మనిషితనం ఒక్కటే తమకు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ‘కంటి వెలుగు పరీక్షలు చేసుకుంటున్న వారిలో రామ్ ఉన్నడు.. రహీమ్ ఉన్నడు.. రాబర్ట్ ఉన్నడు.. ఎస్సీ ఉన్నడు.. ఎస్టీ ఉన్నడు.. ఓసీ ఉన్నడు.. స్త్రీలు ఉన్నరు.. పురుషులు ఉన్నరు.. ట్రాన్స్జెండర్లు ఉన్నరు. కంటి సమస్యలు బయటపడ్డ 16 లక్షల మందిలో అది చిన్న సమస్య కదా అని పట్టించుకోని వారు కొందరైతే, దవాఖానకు తీసుకెళ్లే వారు లేక బాధపడిన వారు కొందరున్నారు. కంటి వెలుగుతో వీరందరి సమస్య పరిష్కారమైంది. మిగతా వారికి తమకు కంటి సమస్య లేదన్న నమ్మకం వచ్చింది. ఇక మీదట మరింత జాగ్రత్త వహించాలనే ఆలోచన వారిలో ఏర్పడింది’ అని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు కన్నీళ్లు
కంటి వెలుగు కార్యక్రమాన్ని పండుగగా నిర్వహిస్తున్నామని హరీశ్రావు చెప్పారు. కంటివెలుగుతో ప్రజలకు ఆనందబాష్పాలు వస్తుంటే, ప్రతిపక్షాలకు కన్నీటి బాష్పాలు రాలుతున్నాయని ఎద్దేవా చేశారు. కంటి పరీక్షలు చేయించుకొని, కండ్లద్దాలు తీసుకున్న ముసలవ్వ, ముసలయ్యలు ‘సీఎం కేసీఆర్ మా పెద్ద కొడుకు లెక్క మా కండ్లు బాగు చేశాడ’ని అంటున్నారని తెలిపారు. కంటి వెలుగును ఢిల్లీ, పంజాబ్ సీఎంలు ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో 8 నెలల పాటు కంటివెలుగు నిర్వహించగా ఈసారి 100 పని దినాల్లోనే పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించిందని, అవసరమైతే మరికొన్ని నిధులు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో సిద్దపేట డీఎంహెచ్వో కాశీనాథం, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
కంటి పరీక్షలు
చేయించుకున్నవారి సంఖ్య : 51,86,486
పురుషులు : 24,33,757
స్త్రీలు : 27,48,923
ఎస్సీలు : 8,67,251
ఎస్టీలు : 5,04,732
బీసీలు : 30,60,343
ఓసీలు : 5,05,845
మైనార్టీలు : 2,45,218
కంటి వెలుగు
ప్రజలకు ఎప్పుడేం కావాలో కేసీఆర్ సార్కు బాగా తెలుసు..
ప్రజా క్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సార్ పని చేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడేం కావాలో అన్ని బాగా తెలిసిన వ్యక్తి. నాకు నిజాంపేటలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేశారు. కండ్లద్దాలు ఫ్రీగా ఇచ్చారు. వాటిని పెట్టుకోగానే అప్పటి వరకు ఉన్న మసకలు పోయి చూపు స్పష్టంగా కనిపిస్తుంది.
– చాకలి రాజయ్య, నిజాంపేట(మెదక్ జిల్లా)