హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్టు వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. బోధన దవాఖానల్లో పనితీరుపై మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుడు ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకొన్నామని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.
సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు జిల్లాకో మెడికల్ కాలేజీ వస్తే దేశంలో వైద్య విద్యకు, నాణ్యమైన వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ అవుతుందని తెలిపారు. వైద్య కళాశాలల్లో విద్యార్థుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని కౌన్సెలింగ్ ఇవ్వాలని, యోగా, ప్రాణాయామం వంటి తరగతులను ప్రారంభించాలని ఆదేశించారు. 800 మంది పీజీ సీనియర్ రెసిడెంట్లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన దవాఖానలకు ఇచ్చామని గుర్తు చేశారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన 900 మంది తెలంగాణ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్షిప్ కోసం అడ్మిషన్లు ఇచ్చామని వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని, సిజేరియన్లు తగ్గాయని అధికారులను అభినందించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ ఇన్చార్జి కమిషనర్ రమేశ్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.