హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ)/ఎర్రగడ్డ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు బాగున్నాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై కాంగ్రెస్ ఎంపీ భువనేశ్వర్ కలితా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చింది. ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక చికిత్సాలయాన్ని కమిటీ బృందం సందర్శించింది. 13 మంది లోక్సభ, రాజ్యసభ సభ్యుల బృందం దవాఖానలో అందుతున్న వైద్య సేవలు, రోగుల సదుపాయాలను పరిశీలించింది. వైద్యసేవలు ఏ విధంగా ఉన్నాయి? ఏవైనా ఇబ్బందులున్నాయా? అని పలువురు రోగులను ఎంపీలు ప్రశ్నించారు. ఎటువంటి ఇబ్బందులు లేవంటూ రోగులు చెప్పడంతో కమిటీ బృందం సంతృప్తి వ్యక్తంచేసింది. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశమైంది.
తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య సంరక్షణ చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వ కార్యక్రమాలను సీఎస్ శాంతికుమారి వివరించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని చెప్పారు. నివారించదగిన అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకాల అమలుతీరుపై పార్లమెంటరీ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డీపీహెచ్ శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.