హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్యభద్రత కార్డులను అందజేయడంతోపాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖానల్లో నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి తదితరులతో కలిసి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్ల బకాయిలను 100 రోజుల్లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీపై వెంటనే రిపోర్టు అందజేయాల్సిందిగా అధికారుల కమిటీని ఆదేశించామని, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఎస్ సమక్షంలో ఈ నెల 15న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని, సీఎస్ నేతృత్వంలో ప్రతి 2 నెలలకోసారి ఈ సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సీపీఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించారు. 2004కు ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ను వర్తింపజేసే అంశాన్ని సైతం పరిశీలించాలని ఆయనకు సూచించారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఉద్యమంలో భాగంగా ఈ నెల 5న జిల్లా కలెక్టరేట్ల ముందు సామూహిక నిరాహార దీక్షలను విరమిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యోగుల 4ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడమే ఇందుకు కారణమని తెలిపారు. మే 5న తలపెట్టిన ఆందోళనను ఉద్యోగ సంఘాల జేఏసీ (లచ్చిరెడ్డి వర్గం) సైతం విరమించింది. సీఎంతో సమావేశమైన వారిలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పుల్గం దామోదర్రెడ్డి, బీ శ్యామ్, ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్), వంగ రవీందర్రెడ్డి, జీ సదానందంగౌడ్, కటకం రమేశ్, మాచర్ల రామకృష్ణగౌడ్, వొడ్నాల రాజశేఖర్, రాములు, కే రామకృష్ణ, వెంకటేశం, డాక్టర్ నిర్మల తదితరులు ఉన్నారు.