Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఓటమి ఎరుగని ధీరులుగా ఖ్యాతి గడించారు. 2004 నుంచి గెలుపు బాటలో పయనిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆరు సార్లు గెలిచి ఏడోసారి కూడా బరిలో నిలిచారు. వారే మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్. వీరిద్దరు 2004, 2008, 2009, 2010, 2014, 2018లో బరిలో నిలిచి గెలిచారు. 2004లో కేసీఆర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సిద్దిపేట స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో హరీశ్రావు మొదటిసారిగా పోటీ చేసి గెలిచారు. నాటి నుంచి నేటివరకు ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. గెలవడమే కాదు ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటున్నారు.
గత ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీ సాధించారు. నియోజకవర్గంపై చెరగని ముద్ర వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఆయన పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. కార్మిక సంఘం నేతగా గుర్తింపు పొందిన కొప్పుల ఈశ్వర్ మేడారం నియోజకవర్గం నుంచి 2004, 2008లో గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం నియోజవర్గం కనుమరుగు కావడంతో ధర్మపురి నుంచి పోటీచేస్తూ వస్తున్నారు. ధర్మపురి నుంచి 2009, 2010, 2014, 2018లో గెలిచారు. ఇప్పుడు ఏడోసారి ఎన్నికల బరిలో నిలిచారు.
నలుగురు జడ్పీ చైర్పర్సన్లకు..
ఈసారి ఇద్దరు శాసనమండలి సభ్యులు (పాడి కౌశిక్రెడ్డి, కడియం), ఒక ఎంపీ (కొత్త ప్రభాకర్రెడ్డి)కి, నలుగురు జడ్పీ చైర్మన్ల(పుట్ట మధు, కోవా లక్ష్మి, కమల్రాజ్, నాగజ్యోతి)తో పాటు జడ్పీటీసీ సభ్యుడి (అనిల్జాదవ్)కి టికెట్లు దక్కాయి.