సంగారెడ్డి : దివంగత మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడని, పేద ప్రజల కోసం పార్టీలకతీతంగా పని చేసిన గొప్ప వ్యక్తి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
ఆదివారం జహీరాబాద్ మండలం హొతి- బి గ్రామంలో జరిగిన ఫరీదుద్దీన్ గారి పతేహా చెహాలుం (40 రోజుల కార్యక్రమం) కార్యక్రమానికి మంత్రి హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫరీదుద్దీన్ లాంటి గొప్ప నాయకున్ని జహీరాబాద్ ప్రజలే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో కష్టపడి పనిచేసే నాయకుడని, గ్రామ సర్పంచ్ గా ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రస్థాయి మంత్రిగా పనిచేశారన్నారు. పేదల పట్ల ఎంతో అభిమానం కలిగి ఉండే వారని, ప్రేమ, నమ్రత, పదిమందికి సహాయం చేయాలన్న గుణం కలిగిన వారని, వారు ప్రజలకు,పార్టీకి అందించిన సేవలను మంత్రి కొనియాడారు.
ఫరీదుద్దీన్ తో తనకున్న అనుబంధాన్ని, కలిసి పనిచేసిన స్మృతులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామంలో, జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్లను మంత్రి ప్రారంభించారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఉమాకాంత్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.