ముషీరాబాద్, డిసెంబర్ 11: అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన బీజేపీ తీరును ఎండగట్టడానికి ఈ నెల 19న ‘ఢిల్లీలో మాదిగల లొల్లి’ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. జాతి హక్కు ల కోసం నిర్వహించతలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఆదివారం వారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన వర్గీకరణ డిమాండ్ను నెరవేర్చని బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ ఎస్సీ వర్గీకణ కోసం 28 ఏండ్లుగా పోరాడుతున్నదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఓట్ల కోసం మాదిగలను వాడుకొని మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో మాదిగ, ఉపకులాల విద్యార్థులు, యువకులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని పాపయ్య, శ్రీనివాస్ పిలుపునిచ్చారు.