హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. శానిటేషన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు, యంత్రాంగం శ్రమించిన తీరు అభినందనీయమని ఆమె కొనియాడారు. మరో 24 గంటలపాటు సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
సురక్షిత ప్రాంతాలకు 19 వేల మంది : డీజీపీ
రాష్ట్రంలో సుమారు 19 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. పలు జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, సీనియర్ పోలీస్ అధికారులను పంపి పరిస్థితులను పర్యవేక్షించామని చెప్పారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెగిన చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేరొన్నారు. విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షపాతం కొన్ని జిల్లాల్లో కురిసినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం చేసిన ఉమ్మడి కృషితో నష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు. పలు జిల్లాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస చర్యలను కలెక్టర్లు వివరించారు.