హైదరాబాద్ : రైతుకు, వ్యవసాయానికి గౌరవం పెంచింది సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు బంధును సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.
వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ ఉచితంగా 24 గంటలు సరఫరా చేస్తున్నారని, రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం, కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నారని ఆయన తెలిపారు. సకాలంలో ఎరువులు పంపిణీ, విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చేశారన్నారు.
రైతు బంధు పథకం కింద 2018 వాన కాలం నుండి 2021 వాన కాలం వరకు రాష్ట్రంలో రైతులకు 43 వేల 36 కోట్ల 57 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం యాసంగి లో రైతు బంధు పథకం కింద 7 వేల 6 వందల 45 కోట్ల రూపాయలు రైతులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని స్పష్టం చేశారు.
ఈ పథకం కింద మిగతా సహాయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. వీటన్నంటి ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని ఎర్రబెల్లి గుర్తు చేశారు.
గత ప్రభుత్వాలు విస్మరించిన వ్యవసాయాన్ని పండుగగా మార్చింది సీఎం కేసీఆర్ అని ఆయన ప్రశంసించారు. దేశంలో వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడంలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు కేంద్రంగానే పని చేస్తుందని స్పష్టం చేశారు.