కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఆయనో చిరుద్యోగి. కానీ, ఆలోచనలు మాత్రం ఉన్నతంగా, భావితరాలకు మేలు చేసేలా ఉన్నాయి. తాను చేసే పని పదిమందికి ఉపయోగపడాలని తపిస్తున్నారు ఆర్టీసీ స్టోర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కరీంనగర్కు చెందిన పల్లె సత్యనారాయణ. ఒక్క మొక్కనాటి సంరక్షించాలంటేనే సతమతమవుతున్న ఈ రోజుల్లో సత్యనారాయణ ఇప్పటికే 48 వేల మొక్కలు నాటి, సంరక్షిస్తున్నారు. లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు. సొంత డబ్బుతో ఏటా వేల సంఖ్యలో మొక్కలు నాటుతూ, సంరక్షిస్తున్న సత్యనారాయణను అటవీశాఖ అధికారులు వృక్షమిత్ర అవార్డుతో సన్మానించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం చౌటపల్లిపల్లె సత్యనారాయణ స్వగ్రామం. హుస్నాబాద్లో చదువుతున్న సమయంలోనే ఆయన మొక్కలు నాటే అలవాటు చేసుకొన్నారు. పట్టణంలోని ఎల్లమ్మ గుడి వద్ద తోటి విద్యార్థులతో కలిసి సత్యనారాయణ నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. ఆర్టీసీలో స్టోర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చిన తర్వాత కరీంనగర్లోని సీతారాంపూర్లో స్థిరపడ్డారు. అయినా మొక్కలు నాటడం ఆపలేదు. 2013-14 సంవత్సరం నుంచి ఏటా వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కరీంనగర్లోని సప్తగిరి కాలనీ 33/11 విద్యుత్తు ఉపకేంద్రం, తాను పని చేస్తున్న ఆర్టీసీ వర్క్షాప్ ఆవరణలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. తాను నివసిస్తున్న సీతారాంపూర్ కాలనీలోని శ్మశానవాటికలో మొక్కలను నాటి, సంరక్షించారు. శాతవాహన యూనివర్శిటీ, బస్స్టేషన్, కోర్టు ఆవరణ, రైల్వే స్టేషన్, ఎస్ఆర్ఆర్ కళాశాల, ప్రభుత్వ ప్రధాన దావాఖాన ఇలా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటుతూనే ఉన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా.. ప్రతి మ్కొ సంరక్షణ తనే చూసుకొంటారు. ఆయన నాటిన మొక్కల్లో 90 శాతానికి పైగా జీవం పోసుకోవడం గమనార్హం. తన నెల జీతంలో ఐదారు వేలు మొక్కల సంరక్షణకే వెచ్చిస్తున్నారు.
నా ప్రాణం ఉన్నంత వరకు మొక్కలు నాటుతూనే ఉంటా. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటి వరకు సొంత ఖర్చుతోనే మొక్కలు నాటుతున్నా. సంరక్షిస్తున్నా. ఒక్కో ట్రీగార్డుకు రూ.110 పెట్టి తెస్తున్నా. మొక్కలు నాటేందుకు తీసే గుంతలకు కూలీలను ఏర్పాటు చేసుకుంటా. వేసవిలో నీళ్లు పట్టేందుకు వాటర్ ట్యాంకర్లు సమకూర్చుకుంటున్నా. తెలంగాణకు హరితహారం పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కార్యక్రమం ఎంతో మంచిది.
– పల్లె సత్యనారాయణ, ఆర్టీసీ ఉద్యోగి, కరీంనగర్