నల్లగొండ : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన ప్రధాని మోదీ, వ్యవసాయ పెట్టుబడిని రెట్టింపు చేసి రైతులను నట్టేట ముంచుతున్నాడని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతుల నడ్డి విరిచే విధంగా ఎరువుల ధరలను వంద శాతం పెంచడం దుర్మార్గం అన్నారు.
దీనికి తోడు పెట్రోల్, డిజీల్ ధరలు పెంచడం రైతాంగానికి నష్టం జరుగుతున్నదని మండిపడ్డారు. గత 90 రోజుల్లో ఎరువుల ధరలను డబుల్ చేశారు. ఎరువుల ధరలు పెరిగితే..ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలన్నారు. రైతులపై భారం పడకుండా సబ్సీడీ కేంద్రం ఇవ్వాలన్నారు.
ఎరువుల ధరల భారాన్ని రైతులపై మోపడం కేంద్రానికి తగదన్నారు.
వ్యవసాయంలో ఎస్ంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలుచేయడంలో మోదీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకురావాలని చూస్తున్న బీజేపీ కుట్రను రైతులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం బృహత్తర పథకాలను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారు.
భారత రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి మేలు జరిగే విధంగా సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. మోదీ పతనం ప్రారంభం అయింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు బొంద పెడతారు. రైతు వ్యతిరేక మోదీని రాజకీయంగా పాతరేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.