హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకురావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బహుళజాతి కంపెనీలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోకి పెట్టబడులను ఆకర్షించేందుకు సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయ జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్తోపాటు అరామ్కో, అల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్, సెడ్కో క్యాపిటల్స్, జెడ్డా చాంబర్స్, సవోలా గ్రూప్, సౌదీ బ్రదర్స్ కమర్షియల్, పెట్రోమిన్ కార్పొరేషన్, బట్టర్జీ హోల్డింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలు, పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సహకాలు, రాయితీల గురించి వివరించారు. తెలంగాణలో నిరంతర విద్యుత్తు సరఫరాతోపాటు, నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని చెప్పారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సానుకూలత వ్యక్తం చేశాయి. మంత్రి శ్రీధర్బాబు వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల అభివృద్ధి, ఎన్నారై వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు.