అవాక్కయిన హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు..
సాంకేతిక సమస్యతోనేనన్న బ్యాంకు అధికారులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 30: ఖాతాల్లో కోట్లలో నగదు జమ కావడంతో హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు అవాక్కయ్యారు. గంటల్లోనే ఖాతాల్లోని నగదు తిరిగి మాయమవ్వడంతో బ్యాంకులకు పరుగులు తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా గందరగోళం నెలకొన్నదని, అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్టు పలువురు బ్యాంకు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన మొబైల్ షాప్ నిర్వాహకుడు వెంకట్రెడ్డి ఖాతాలో ఏకంగా రూ.18.52 కోట్లు జమైనట్టు మెసేజ్ వచ్చింది. అయితే కొద్దిసేపటికే లావాదేవీలు నిలిచిపోవడంతో ఖాతా హ్యాక్ అయ్యిందేమోనని ఆందోళన చెందాడు.
బ్యాంకు అధికారులను సంప్రదించగా, కొత్త సాఫ్ట్వేర్ మార్పిడి కారణంగానే నగదు జమైనట్టు వారు తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన మొబైల్ షాపు నిర్వాహకుడు సాయికి సైతం ఆదివారం రాత్రి రూ.5.68 కోట్ల నగదు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేటకు చెందిన వంగల సాయి ఖాతాలో రూ. కోటి, మంచిర్యాల జిల్లాకేంద్రానికి చెందిన పున్నం లక్ష్మణ్ అకౌంట్లో రూ.83 లక్షలు జమయ్యాయి. కాగా, ఖాతాల్లో కోట్ల జమ వార్త దావానంలా వ్యాపించింది. తమ ఖాతాల్లో ఏమైనా నగదు జమ అయిందేమోనని హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొన్నారు.
వెంకట్రెడ్డి ఖాతాలో 18.52 కోట్లు జమైనట్టు వచ్చిన మెసేజ్