కరీంనగర్ తెలంగాణచౌక్, ఆగస్టు 1 : ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణచౌక్లో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరై జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి, ఆటో డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్ల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటో కార్మికులకు అండగా ఉన్నారని, పైసా ఖర్చు లేకుండా రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. ఆటో ఫిట్నెస్ కోసం సుమారు రూ.350 కోట్లు విడుదల చేసి కార్మికులపై భారం పడుకుండా చేసినట్లు చెప్పారు.
కార్మికుల సంఘ భవనాల కోసం స్థలం, నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే ఆటో కార్మికులను కూడా మాయ మాటలతో మోసం చేసిందని ధ్వజమెత్తారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదని, ఆటో డ్రైవర్కు ఏటా రూ.12 వేలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక ఉపాధి కోల్పోయారని, కిస్తీలు, ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో సీనియర్ ఆటో డ్రైవర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి సంపత్, ఉపాధ్యక్షుడు కొత్తూరి సత్యనారాయణ, నాయకులు అంజయ్య, రాజు, యాకూబ్ పాల్గొన్నారు.