యాదాద్రి భువనగిరి : ప్రజల జీవన స్థితిగతులు తెలుసుకోవడం.. ఎక్కడైనా లోపాలు ఉంటే ప్రభుత్వానికి తెలుపడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడం మానవ హక్కుల కమిషన్(Human Rights Commission) బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ జి. చంద్రయ్య అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటన సందర్భంగా చంద్రయ్య మంగళవారం భువనగిరి పట్టణంలోని ఆర్ అండ్ బి ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు.
వారికి భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి మొక్క బహుకరించి స్వాగతం పలికారు. అనంతరం కమిషన్ చైర్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ.. మానవ హక్కుల అమలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడం, ప్రభుత్వ స్కీముల పని విధానం, ప్రభుత్వ అధికారుల పని విధానం, ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడం, అలాగే ఎక్కడైనా లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కమిషన్ బాధ్యత అని అన్నారు.
రేపు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయములో అన్ని శాఖల జిల్లా అధికారులతో జిల్లాలో మానవ హక్కుల అమలు ఏ విధంగా జరుగుతున్నది, మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు సరిగా అమలు జరుగుతున్నాయా? ప్రభుత్వ స్కీములు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అనే అంశాలను సమీక్షిస్తామన్నారు.
ప్రజల జీవన హక్కు, స్వాతంత్య్ర హక్కు, సమానత్వ హక్కు, ఆత్మగౌరవ హక్కులను కాపాడడమే మానవ హక్కుల కమిషన్ లక్ష్యమని, ప్రజలను చైతన్యవంతం చేసే క్రమంలో కమిషన్ తనకు తానుగా, అంతే కాకుండా ఇతర స్వచ్ఛంద సంస్థలతో మమేకమై సభలు సమావేశాలు నిర్వహిస్తుందన్నారు.
ప్రభుత్వ దవాఖానల పనితీరు బాగుందన్నారు. అత్యవసరం అయితే తప్పా సిజేరియన్ చేయవద్దన్నారు. ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. ప్రభుత్వ పథకాలు చేరవేయడంలో మీడియాది కూడా కీలక బాధ్యత అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం పరిపక్వత చెందాలంటే, విలువలు అభివృద్ధి చెందాలంటే సమాచారం పాత్ర ఎంతో వుందని, ఇందుకు పాత్రికేయులు తమ వంతు కృషి చేయాలని అన్నారు.