(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వైఖరి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదంటూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించడంపై నెటిజన్లు, తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ర్టానికి లైఫ్లైన్(జీవనాడి)లాంటిదని శ్రీను అనే నెటిజన్ అభివర్ణించారు. 2028లో మళ్లీ బీఆర్ఎస్ సర్కార్దే విజయమ ని, కాళేశ్వరం జలాలు అప్పటినుంచి నిర్విరామంగా దుం కడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ మరో నెటిజన్ మధుసూదన్రెడ్డి ఎక్స్లో పోస్ట్ పె ట్టారు. కాళేశ్వరంలో అవినీతి జరుగలేదనడానికి కోర్టు తీ ర్పే సాక్ష్యమని రఘువీర్ రాథోడ్ అనే ఇంకో నెటిజన్ కా మెంట్ చేశారు. సీఎం రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పసలేని ఆరోపణలకు స్వస్తిచెప్పి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని వెంకట్ రాసాల అనే నెటిజన్ హితవు పలికారు.
‘తెలంగాణ గుండెకాయ లాంటి కాళేశ్వరాన్ని ఆపి, మన నీళ్లను పక్క రాష్ర్టానికి ధారపోస్తూ అబద్ధాలతో బతుకుతున్నవారికి హైకోర్టు తీర్పు చెప్పుదెబ్బతో సమానమని ప్రభుత్వ తీరును ఎండగడుతూ గాయత్రి అనే నెటిజన్ ట్వీట్ చేశారు. ‘ఎవడెన్ని కుట్రలు చేసినా.. ఎవడెన్ని కూతలు కూసినా.. తెలంగాణ జీవధార, ప్రాణధార కాళేశ్వరమే’నని శశాంక్ అనే మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్.. జయహో కాళేశ్వరం.. వచ్చేది బీఆర్ఎస్ సర్కారే’ అంటూ వివేక్ అనే నెటిజన్ పోస్టు చేశారు. మొత్తంగా హైకోర్టు తీర్పును స్వాగతించి, ప్రభుత్వ అసత్యాలను సోషల్మీడియా వేదికగా ఎండగట్టారు.