హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ గత శాసనసభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ను ట్యాంపరింగ్ చేశారంటూ ఇటీవల తీర్పు చెప్పిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల (స్పెషల్) కోర్టు జడ్జి కై జయకుమార్పై హైకోర్టు సస్పెన్షన్ వేటువేసింది. ఎలక్షన్ అఫిడవిట్ను శ్రీనివాస్గౌడ్ ట్యాంపరింగ్ చేసేందుకు సహకరించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఇతర అధికారులపై కేసు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేయడంలో జడ్జి తన పరిధిని అతిక్రమించారని హైకోర్టు మంగళవారం నిర్ధారణకు వచ్చింది.
శ్రీనివాస్గౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ మహబూబ్నగర్కు చెందిన సీహెచ్ రాఘవేంద్రరాజు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ కోర్టు జడ్జి జయకుమార్ విచారణ జరిపి గత నెల 31న ఉత్తర్వులు వెలువరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, 2018లో మహబూబ్నగర్లో ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన పలువురు ఐఏఎస్ అధికారులు, మంత్రి శ్రీనివాస్గౌడ్ సహా 10 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ద్వారా జడ్జి తన పరిధిని అతిక్రమించారని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో మార్పులు చేర్పులకు లేదా ట్యాంపరింగ్తో కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ప్రజాప్రతినిధుల కోర్టు తన పరిధిని దాటి ఉత్తర్వులు జారీచేసిందని, కింది కోర్టు జడ్జీలపై పాలనాపరమైన నియంత్రణ అధికారం హైకోర్టుకే ఉంది కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ ఫిర్యాదును పరిశీలించిన హైకోర్టు ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి పరిధి దాటినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. జడ్జి కే జయకుమార్పై సస్పెన్షన్ వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్రమశిక్షణాచర్యలు పెండింగ్లో ఉండగా జడ్జి పదవిలో కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు హైకోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ను విడిచివెళ్లకూడదని షరతు విధించింది.
మరోవైపు.. శ్రీనివాస్గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికల అఫిడవిట్ను మార్పు చేసుకొనే అవకాశం అభ్యర్థులకు ఉంటుందని తెలిపింది. ఒకసారి సమర్పించిన అఫిడవిట్ను నామినేషన్ గడువు ముగిసేలోగా మార్పు చేసుకుంటే తప్పులేదని చెప్పింది. మంత్రితోపాటు ఈసీ అధికారులపై కేసులు పెట్టాలని ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన రోజు (జూలై 31)నే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రజాప్రతినిధుల కోర్టు మౌఖికంగా జారీచేసిన ఆదేశాల తర్వాత మహబూబ్నగర్ పోలీసులు ఈసీ అధికారులతోపాటు మంత్రి శ్రీనివాస్గౌడ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తప్పుపడుతూ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్రశర్మ రాష్ట్ర హైకోర్టుకు వినతిపత్రంసమర్పించారు. దీనిపై రిజిస్ట్రార్ జనరల్ విచారణ చేపట్టి హైకోర్టు పరిపాలనా అధిపతి అయిన ప్రధాన న్యాయమూర్తికి నివేదిక సమర్పించారు. సీఆర్పీసీలోని సెక్షన్ 200 ప్రకారం రాఘవేంద్రరాజు ఫిర్యాదు తర్వాత నాంపల్లి కోర్టు జడ్జి ప్రాథమిక విచారణ చేయకుండా, వాంగ్మూలాన్ని నమోదు చేయకుండానే దర్యాప్తు చేయాలని పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చారని పేరొన్నారు. దీంతో జడ్జిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు మంగళవారం నిర్ణయించింది.