హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ నిర్వహణలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు భూమి కేటాయింపుతోపాటు ఏటా రూ.3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు జారీచేయడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయిదుర్గంలోని సర్వే నం. 83/1లో ఐఏఎంసీకి 3.70 ఎకరాలను కేటాయిస్తూ 2021 డిసెంబర్లో జీవో 128ను జారీచేసిన ప్రభుత్వం..
ఐఏఎంసీకి ఏటా రూ.3 కోట్ల ఆర్థిక సాయం అందజేసేందుకు 2022లో జీవో 78, 385లను జారీచేసిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దాదాపు రూ.300 కోట్ల విలువైన ఆ భూమిని ఐఏఎంసీకి కేటాయించడంతోపాటు నిర్వహణ ఖర్చుల కోసం ఏటా ఆ సంస్థకు రూ.3 కోట్లు ఇవ్వడం ప్రజా వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఐఏఎంసీకి సంబంధించిన నిర్మాణాలను నిలిపివేయడంతోపాటు ఇప్పటివరకు ఆ సంస్థకు చెల్లించిన మొత్తాన్ని వెనకి తీసుకునేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. దీంతో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు న్యాయశాఖ కార్యదర్శికి, ఐఏఎంసీ సీఈవోకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది.