హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ):సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు హైకోర్టులో ఊరట లభించింది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన 441 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయం చెల్లదని, కొప్పుల తన అఫిడవిట్లో వాస్తవాలను గోప్యంగా ఉంచడంతోపాటు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్) దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం ప్రకటించారు. వీవీప్యాట్లలోని ఓట్ల లెకింపులో అక్రమాలు జరిగాయన్న అభియోగాలకు డాక్యుమెంటరీ ఆధారాలను చూపకపోవడమే ఇందుకు కారణమని తీర్పులో స్పష్టం చేశారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొప్పుల, అడ్లూరి ధర్మపురిలో పోటీపడుతున్నారు.