హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అద్భుత విజయాలు సాధించబోతున్నది. హ్యాట్రిక్ విజయంతో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నది. తెలుగు రాష్ర్టాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా అవతరించబోతున్నది. అనేక స్థానాల్లో రికార్డు స్థాయి మెజార్టీలు నమోదు చేయబోతున్నది. మొత్తంగా 94 నియోజకవర్గాల్లో 35 శాతం పైగా ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించనున్నది. ఇందులో 40 స్థానాల్లో 50శాతానికిపైగా ఓట్లు సాధించనున్నది. ఇదీ మునుగోడు ఉప ఎన్నిక తరువాత రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్వేల్లో తేలిన నిజం. మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఐదు ప్రముఖ సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాయి.
రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో పార్టీ, అభ్యర్థుల వారీగా సర్వేలు చేసిన ఆయా సంస్థలు తమ నివేదికలను టీఆర్ఎస్కు, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు కూడా అందజేశాయి. 2018 నాటి కంటే ఎక్కువ మెజార్టీతో టీఆర్ఎస్ తిరిగి అధికారం కైవసం చేసుకోబోతున్నదని అన్నీ సర్వే సంస్థలు తేల్చిచెప్పాయి. కొన్ని నియోజకవర్గాల్లో రికార్డు స్థాయి మెజార్టీలు నమోదవుతాయని అంచనా వేశాయి. టీఆర్ఎస్ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచినప్పటికీ, అది సమీప ప్రత్యర్థిగా కాకుండా నామమాత్రపు ప్రత్యర్థిగానే ఉండబోతున్నది. ఇక బీజేపీ మూడో స్థానంలో అనామక ప్రత్యర్థిగా ఉండబోతున్నదనేది సర్వేల సారాంశం. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో 1983 తరువాత వరుసగా మూడోసారి ఏ పార్టీ కూడా అధికారం చేపట్టలేదని, ఈ ఘనతను టీఆర్ఎస్ సాధించబోతున్నదని సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. వరుసగా పదేండ్లు అధికారంలో ఉన్న తరువాత కూడా దేశంలో ఇంత స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్టీ మరొకటి లేదనేది సర్వే నివేదికల సారాంశం.
40 నియోజకవర్గాల్లో 50% పైగా ఓట్లు
రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా మజ్లిస్ పార్టీ బలంగా ఉన్న 7 నియోజకవర్గాలను మినహాయించి మిగతా 112 నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించారు. వీటిలో టీఆర్ఎస్ 94 నియోజకవర్గాల్లో 35 శాతానికి పైగా ఓట్లు సాధించి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇందులో 40 నియోజకవర్గాల్లో ఏకం గా 50% ఓట్లు దాటనున్నాయి. మిగిలిన 18 నియోజకవర్గాల్లో 30% పైగా ఓట్లు వస్తాయని అంచనా. అత్యధిక మెజార్టీలు ఈ సారి కూడా సిద్దిపేట, సిరిసిల్లలో నమోదు కానున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో 65-66% ఓట్లు టీఆర్ఎస్కు లభించనున్నాయి. ఇక్కడ ప్రత్యర్థులకు ఈసారి కూడా డిపాజిట్లు దక్కడం అనుమానమే. ఇక అనూహ్యంగా అత్యధిక మెజార్టీ వచ్చే సీట్లలో సికింద్రాబాద్ ఉండటం విశేషం. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తర్వాత ఉప సభాపతి పద్మారావుగౌడ్ అత్యధిక ఓట్లు సాధించనున్నారు.
నియోజకవర్గంలో ఆయన ప్రదర్శిస్తున్న పనితీరు ఆయనను ప్రత్యర్థులకు అందనంత ఎత్తున నిలబెడుతుందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఒకరిద్దరు మినహాయిస్తే దాదాపు మంత్రులు అందరూ 50% పైగా ఓట్లు సాధించి, తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించనున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి తన ప్రత్యర్థికన్నా 19-20% ఆధిక్యతతో తిరుగులేని విజయం సాధిస్తారని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి పది అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ గెలువబోతున్నది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఈసారి అక్కడ ఓడిపోతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. నిజామాబాద్, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ విజయం నల్లేరు మీద నడకే అని తేలింది. భద్రాచలంలో టీఆర్ఎస్కు 31% ఓట్లు వస్తాయని, ఇక్కడ ఈసారి గులాబీ జెండానే ఎగురుతుందని సర్వే సంస్థలు సూచిస్తున్నాయి. స్పీకర్గా పనిచేసినవారికి ఎన్నికలు అచ్చిరావనే సెంటిమెంట్ను కూడా ఈ సారి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి బ్రేక్ చేస్తారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఆయనకు బాన్సువాడ నియోజకవర్గంలో 53% ఓట్లు వస్తాయని సూచిస్తున్నాయి.
బీజేపీకి 6-7 స్థానాల్లో డిపాజిట్లు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఈసారి కూడా అదే పరిస్థితిని ఎదుర్కోక తప్పదని సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీకి కేవలం 6-7 స్థానాల్లో డిపాజిట్లు దక్కే అవకాశం ఉన్నదని, వాటిలో రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తున్నాయి. ఎక్కడా బీజేపీకి 10-12 శాతానికి మించి ఓట్లు రావని సర్వేల్లో తేలింది.
కేసీఆర్ ఉంటేనే సుస్థిరత, అభివృద్ధి
సర్వే సంస్థలు ఓటర్లకు పలు ప్రశ్నలు సం ధించాయి. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కన్నా పార్టీని చూసే ఓట్లు వేస్తామని ఓటర్లు చెప్పారు. టీఆర్ఎస్కు ఎందుకు ఓటేస్తారన్న ప్రశ్నకు.. ‘కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. కేసీఆర్ తప్ప రాష్ర్టానికి మరొకరు న్యాయం చే యలేరు’ అని పలువురు సమాధానాలు చెప్పా రు. మరికొందరు లిఖితపూర్వక సమాధానాల్లో పొరుగు రాష్ట్రంలో (ఏపీ) పగలు కూడా కరెం టు ఉండటంలేదు. రోడ్ల పరిస్థితి దారుణం. అక్కడి పరిస్థితి చూస్తే.. తెలంగాణలో కేసీఆర్కు తప్ప మరొకరికి ఓటేయవద్దని నిర్ణయించుకున్నామని సమాధానం చెప్పారు. ఓ వ్యాపారవేత్త స్పందిస్తూ.. ‘నాకు కర్ణాటకలో కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది. అక్కడ ఒక చదరపు అడుగు నిర్మాణానికి (ఎస్ఎఫ్టీ) రూ.30 నుంచి రూ. 55 వరకు లోకల్ లీడర్లు మామూళ్లుగా వసూ లు చేస్తున్నారు. అక్కడ లంచాలు చూస్తే తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రం అనిపిస్తుంది. టీఎస్-బీపాస్ ఉండటంతో లంచాల బాధ తప్పింది. టప్పామే అప్లయ్ కరేతో.. టప్పామే హంకో పర్మిషన్ మిల్హ్రాహై’ అని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో హలాల్, హిజాబ్ తప్ప ఏమున్నదని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ వంటి పరిస్థితి లేదని, ఇదో అద్భుతమని పేర్కొన్నారు. ఇలాంటి పాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని, అవసరమైతే తామే ఖర్చులు పెట్టుకొని టీఆర్ఎస్ను గెలిపిస్తామని హైదరాబాద్కు చెందిన మరో వ్యాపారి స్పష్టం చేశారు. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి ఇంతటి ప్రజామద్దతు లభించడం మామూలు విషయం కాదని సర్వే సంస్థలు విశ్లేషిస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోరు
లోక్సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అఖండ విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగాను 16 టీఆర్ఎస్కే దక్కుతాయని సర్వేల్లో తేలింది. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో కిషన్రెడ్డిని పొరపాటున గెలిపించామన్న అభిప్రాయం అక్కడి ఓటర్లలో ఉన్నట్టు తేలింది. మల్కాజిగిరిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి 10 శాతమే ఓట్లు వస్తాయని, ఈసారి ఆయన గెలవడం కష్టమేనని సర్వే సంస్థలు చెప్పాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించడం కూడా లోక్సభ స్థానాలు పెరగడానికి ఒక కారణంగా సర్వే సంస్థలు చెప్తున్నాయి.