హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లుపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే క్రూరమైన ఆయుధంగా అభివర్ణించారు. ప్రభుత్వం విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇలాంటి నిరంకుశ చట్టాలను తెస్తున్నదని మండిపడ్డారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని సోమవారం ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినా, బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని విమర్శించారు.
‘అమలు యంత్రాంగం ఆధారాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎకువ ప్రాధాన్యం ఇచ్చేలా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. ఇది కచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. బిల్లులో ఉపయోగించిన ‘వ్యతిరేక భావాలు ప్రేరేపించడం’, ‘సామాజిక సమగ్రతను దెబ్బతీయడం’ వంటి పదాలకు స్పష్టమైన న్యాయ పరిమితులు లేవని ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ఫేక్న్యూస్గా ముద్రవేసి జైలుకు పంపే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.
‘శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కేటీఆర్ గుర్తుచేశారు. కేవలం ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని కోర్టు స్పష్టంచేసిందని తెలిపారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టంచేశారు.
ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్యులు తమ అభిప్రాయాలను పంచుకోవాలంటేనే భయపడేలా ఈ శిక్షలు ఉన్నాయి. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్పై తగినన్ని చట్టాలు ఉండగా, అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి?’ అని ప్రశ్నించారు. వెంటనే ఈ బిల్లుపై పునఃసమీక్షించాలని, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ అణచివేత ధోరణిని వీడాలని డిమాండ్ చేశారు.