CM KCR | జహీరాబాద్/యాదగిరిగుట్ట, మార్చి 25: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామానికి చెందిన నాగయ్య స్వామి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుకున్నారు. ఈ మేరకు ఈ నెల 15న ధనసిరి గ్రామం నుంచి ఆయన పాదయాత్రగా యాదగిరిగుట్టకు బయలుదేరారు.
210 కిలోమీటర్లు పాదయాత్ర చేసి భువనగిరికి చేరారు. అక్కడి నుంచి పొర్లుదండాలతో శనివారం యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం చేరుకున్నారు. కాలినడకన మెట్లమార్గం ద్వారా కొండపైకి వెళ్లి స్వామివారికి పూజలు చేశారు. ఆయనకు రోడ్డు వెంట ప్రజలు ఘన స్వాగతం పలికారు. నాగయ్య స్వామి వెంట ధనసిరి గ్రామ సర్పంచ్ హంప్సి రాజు, బీఆర్ఎస్ నాయకులు అశోక్, దశరథ్తోపాటు పలువురు గ్రామస్థులు ఉన్నారు. ఈ సందర్భంగా నాగయ్య స్వామి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీలతో జహీరాబాద్ ప్రాంతానికి ఎలాంటి మేలు జరగలేదని వాపోయారు.
తెలంగాణ రాక ముందు విద్యుత్తు, సాగునీరు, పంట పెట్టుబడికి తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానని, సీఎం కేసీఆర్ రైతుబంధు ప్రవేశపెట్టిన తర్వాత తనకు పంట పెట్టుబడి రంది తీరిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటిలాగే మళ్లీ పాదయాత్రతో వచ్చి, పొర్లుదండాలతో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటానని నాగయ్య స్వామి వివరించారు.