Nagarjuna Sagar | హైదరాబాద్, మార్చి28 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా ? ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసినా.. ఇప్పటివరకు మళ్లీ ఆ అంశంపై స్పందించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుపై పట్టు కోసం ఏపీ తీవ్రంగా యత్నిస్తున్నది. కేంద్ర జల్శక్తిశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అదునుగా తీసుకుని ప్రాజెక్టు ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ పనులను స్వాధీనం చేసుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ, తాజాగా ఆ పనులు తామే నిర్వహించుకుంటామని బోర్డుకు లేఖ రాయడం ఏపీ ప్రయత్నాలకు ఉదాహరణగా నిలుస్తున్నది.
నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణ తెలంగాణ, శ్రీశైలం డ్యామ్ నిర్వహణ, మెయింటనెన్స్ను ఏపీ సర్కారు చూడాల్సి ఉంది. రాష్ట్ర పునర్విభజన నాటి నుంచీ ఇదే విధానం కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ డ్యామ్కు తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లతో మరమ్మతులు చేపట్టింది. ప్రధానంగా గేట్ల రబ్బర్సీల్స్ను మార్చడం, గ్రీజింగ్, రోప్ల మార్పిడితోపాటు, గ్యాంట్రీ పట్టాల మార్పిడి, గ్యాలరీ తదితర పనులు కొంతకాలంగా నిర్వహిస్తున్నది. ఇదిలా ఉండగా ఏపీ సర్కారు అక్రమంగా డ్యామ్కు కుడివైపు 13వ గేట్వరకు, కుడికాలువ రెగ్యులేటర్ను ఆక్రమించడం, అటు తరువాత కేంద్రం జోక్యం చేసుకుని సీఆర్పీఎఫ్ బలగాలను అక్కడ ఏర్పాటు చేయడం తెలిసిందే. అంతేకాకుండా డ్యామ్కు సంబంధించి తమ భూభాగంలోని మరమ్మతులను ఇరు రాష్ర్టాలు చేసుకోవచ్చని, అందుకు కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అని, అనుమతులు ఉంటేనే అధికారులను అనుమతించాలని కేంద్రం సీఆర్పీఎఫ్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అదునుగా తీసుకుని ఏపీ దూకుడు పెంచింది. బోర్డు అనుమతితోనే ఏపీవైపున తెలంగాణ చేపట్టిన ఓఅండ్ఎం పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలోనే బోర్డుకు ఏపీ లేఖ రాసింది. ఈ మేరకు బోర్డు అధికారులు ఆ ప్రాంతాన్ని గతంలోనే సందర్శించారు. తాజాగా ఏపీ మరో మెలిక పెడుతున్నది. తమ భూభాగంలోని మరమ్మతు పనులు తామే చేసుకునేందుకు అనుమతులు మంజూరు చేయాలని బోర్డుకు మళ్లీ లేఖ రాసింది. దీంతో ఏపీ భూభాగంలోని పనులపై సందిగ్ధత నెలకొన్నది. బోర్డు కూడా ఇప్పటివరకు ఏపీ లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
సాగర్ డ్యామ్ వివాదంపై తెలంగాణ సర్కారు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నదని ఇంజినీరింగ్ అధికారులే చర్చించుకుంటున్నారు. సాగర్ డ్యామ్ను ఏపీ ఆక్రమించుకున్న తరువాత జనవరి17న కేంద్ర జలశక్తిశాఖ తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలోనే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయించగా, తెలంగాణ సర్కారు అంగీకరించింది. అయితే తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రాజెక్టులను అప్పగించేది లేదని కేంద్రజల్శక్తిశాఖకు లేఖ రాసింది. ఆపై అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసింది. ఆ తర్వాత సాగర్ డ్యామ్ ఉదంతంపై కేంద్ర జలశక్తిశాఖ ఫిబ్రవరిలో మరో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయిస్తే మాత్రం హాజరుకాలేదు. ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేయాలనే సాకుతో సమావేశం వాయిదా వేయాలని కోరింది. నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర సర్కారు సాగర్ డ్యామ్ ఉదంతంపై ఆరా తీసిన దాఖాలాల్లేవని అధికారులే వెల్లడిస్తున్నా రు. అసెంబ్లీ తీర్మానాన్ని బోర్డుకు అప్పగించి చేతులు దులుపుకుందని, సాగర్డ్యామ్ను పూర్తిగా వదిలేసినట్లుగా సర్కారు వ్యవహరిస్తున్నదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సాగర్ డ్యామ్ ఓఅండ్ఎం పనులు సజావుగా సాగేందుకు చొరవ చూపాలని ఇంజినీరింగ్ అధికారులు కోరుతున్నారు.