హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఖాళీ ప్రాంతాలన్నీ హరితమయం అయ్యేలా ఎనిమిదో విడత హరితహారంలో మొక్కలు నాటాలని సంబంధిత శాఖలకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 19.54 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్శాఖ 8.76 కోట్లు, మున్సిపల్శాఖ 7.32 కోట్లు, సాగునీటి పారుదలశాఖ 5 కోట్లు, అటవీశాఖ 1.54 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు. 8వ విడత తెలంగాణకు హరితహారం పురోగతిపై బుధవారం అరణ్యభవన్లో నిర్వహించిన అటవీ, రాష్ట్రస్థాయి పరిశీలన, సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏడు విడతల్లో హరితహారం అనుభవాలను పరిగణనలోకి తీసుకొని లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తున్నాయని, మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఇరిగేషన్శాఖ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల వెంట పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మొక్కలు నాటే కార్యచరణపై చర్చించారు. సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్, మున్సిపల్శాఖ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, అదనపు పీసీసీఎఫ్ ఏకే సిన్హా, హెచ్ఎండీఏ డైరెక్టర్ (అర్బన్ ఫారెస్ట్రీ) డాక్టర్ ప్రభాకర్, అటవీ, మున్సిపల్, సాగునీటి, పంచాయతీరాజ్శాఖలతోపాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.