హైదరాబాద్ : దూలపల్లిలోని తెలంగాణ రాష్ర్ట అటవీ అకాడమీలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ, తెలంగాణ రాష్ర్ట అకాడమీ సంచాలకులు పీవీ రాజారావు, ఉప సంచాలకులు యస్ రమేశ్ హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, అకాడమీ సిబ్బంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొని 500 మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆర్. శోభ మాట్లాడుతూ.. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులందరూ.. భవిష్యత్లో అడవులను కాపాడాలన్నారు. అటవీ శాఖలో ఉద్యోగం చేయడమంటే.. సమాజానికి సేవ చేయడమే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి.. అడవుల సంరక్షణకు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. అడవుల పునరాభివృద్ధికి, అటవీ విస్తీర్ణం పెంపొందించడానికి కృషి చేయాలని శోభ సూచించారు.