హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గురుపూజోత్సవానికి గైర్హాజరుకావడంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక మీకు లేదా ?’ అంటూ నిలదీశారు. ‘విద్యాశాఖపై మీకున్న చిత్తశుద్ధికి, ఆ శాఖకు మీరు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదే నిదర్శనం’ అని గురువారం ‘ఎక్స్’ వేదికగా విమర్శలు సంధించారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు. ‘ఓవైపు టీచర్లు లేక స్కూళ్లను మూసేస్తున్నరు.. మరో వైపు పురుగుల అన్నం.. గొడ్డుకారం తినలేక పిల్లలు ఏడుస్తున్నరు.
ఫుడ్ పాయిజన్లు, పాముకాట్లు, కుక్కకాట్లు, ఎలుకకాట్లతో విద్యార్థులు రోదిస్తున్నరు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి సర్కారు గురుకులాల ఖ్యాతిని రోజురోజుకూ దిగజార్చుతున్నదని విమర్శించారు. పాఠాలు చెప్పే టీచర్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారని, తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. ఉన్న విద్యావ్యవస్థను సక్రమంగా నిర్వహించడం ప్రభుత్వానికి చేతగావడంలేదని, పైగా సమీకృత గురుకులాలు, విద్యా కమిషన్ అంటూ భ్రమలు కల్పిస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో పతనమవుతున్న విద్యావ్యవస్థ గురించి టీచర్లు, విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారని సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.